హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో జరిగిన డీఆర్ఎస్ వివాదం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత క్రికెటర్లను తప్పుగా చూపిస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రస్తాయిలో మండిపడ్డాడు.
డీఆర్ఎస్ వివాదం ముగిసిన అధ్యాయమని, కానీ ఆసీస్ మీడియా దానిని సాగదీస్తూ వరుస కథనాలను ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేలపై ఆసీస్ మీడియా చేసిన ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్కు మద్దతిచ్చే క్రమంలో ఆస్ట్రేలియా మీడియా పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నాడు.
వీటిని పట్టించుకోకుండా, ఆఫ్ ద ఫీల్డ్ విషయాల్ని పక్కకు పెట్టి క్రికెట్పై దృష్టి సారించాలని భారత క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇక రాంచీ టెస్టులో జయంత్ యాదవ్ స్ధానంలో ఓపెనర్ మురళీ విజయ్కు తుది జట్టులో చోటు కల్పించడంపై గవాస్కర్ స్పందించాడు.
రాంచీ టెస్టులో మూడో స్పిన్నర్గా జయంత్ యాదవ్ని తీసుకుంటారని తాను భావించానని, అయితే ఓపెనర్ మురళీ విజయ్కు తుది జట్టులో చోటు కల్పించడం తనను ఆశ్చర్యపరిచిందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.