న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. తామిచ్చిన సిఫార్సులను బీసీసీఐ విస్మరించిందని లోధా కమిటీ కోర్టుకు నివేదిక ఇవ్వగా, ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
బీసీసీఐ పెద్దలు తమకు తామే చట్టమని భావిస్తున్నట్టు అనిపిస్తోందని, వారిలా లోధా కమిటీ సిఫార్సులను పక్కన బెడతారని భావించలేదని ఆయన అన్నారు. ఈ సిఫార్సులకు బీసీసీఐ కట్టుబడి వుండాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తమ సూచనలను అమలు చేయని కారణంగా అవసరమైతే బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే, ఇతర సిబ్బందిని
తొలగించాలని లోధా కమిటీ సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సుప్రీం బిసిసిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, ఆపై బెట్టింగ్ బాగోతాలు వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టు లోధా కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన కమిటీ, బీసీసీఐ చీఫ్ సహా పలువురు అధికారులను తక్షణం తొలగించాలని సిఫార్సు చేసింది. బోర్డును ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడింది.