హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో బీసీసీఐకి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లోధా కమిటీ సిఫారసులు కచ్చితంగా అమలు చేయాలంటూ జూలై 18న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ బీసీసీఐ వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ పిటిషన్ను పరిశీలించిన టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని తిరస్కరిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 'రివ్యూ గురించి చేసిన విజ్ఞప్తిని అన్ని విధాలా పరిశీలించాం. మా ఉత్తర్వును వెనక్కి తీసుకునే విధంగా ఎలాంటి తప్పూ కనిపించలేదు. కాబట్టి దీనిని కొట్టివేస్తున్నాం' అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు నవంబర్ 10నే ఈ ఉత్తర్వులు ఇచ్చినా ఇటీవలే ఆ ఉత్తర్వులను కోర్టు వెబ్ సైట్లో ఉంచారు. లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో బహిరంగ విచారణ జరపాలని, ఒక రాష్ట్రం ఒక ఓటు ప్రతిపాదనను తప్పించాలని బోర్డు వేర్వేరు అంశాలపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఈ రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మరోవైపు లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సంఘాల్లో 70 ఏళ్ల వయసు పైబడిన వారిపై వేటు వేయాలని లోధా కమిటీ కోర్టుకు సూచించిన నేపథ్యంలో జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఏం తీర్పు చెబుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి ఈనెల 9నే తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇప్పటికే ఇది రెండు సార్లు వాయిదా పడగా, సుప్రీం కోర్టు బుధవారం నాటికి వాయిదా వేసింది.