న్యూఢిల్లీ: బీసీసీఐకి సుప్రీం కోర్టు శుక్రవారం మరో షాక్ ఇచ్చింది. జస్టిస్ లోధా కమిటీ సూచించిన సిఫారసులను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీసీఐకి సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. లోధా కమిటీ సిఫారసులపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది.
వదలం: లోథా సంస్కరణలపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
లోధా కమిటీ ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ ప్రతిపాదనల అమలుకు రెండు వారాల గడువు విధించింది. దీంతో బీసీసీఐ ఆర్ధిక లావాదేవీలకు సుప్రీం బ్రేక్ వేసింది. లోధా కమిటీ సూచించిన సిఫారసులకు అంగీకారం తెలిపే వరకూ రాష్ట్రాల అసోసియేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి ఆదేశాలు జారీచేసింది.
అంతేకాదు లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామంటూ డిసెంబల్ 3 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా బీసీసీఐ కాంట్రాక్టులను పరిశీలించేందుకు గాను లోధా కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర ఆడిటర్ ను నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లోధా కమిటీ సూచనలను అమలు చేసేందుకు రెండు వారాలు తుది గడువు ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. కాగా, బీసీసీఐలో లోథా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
గత వారంలో లోథా కమిటీ సంస్కరణ అమలుకు బీసీసీఐ సమయం కోరిగా... ఎప్పుడు అమలు చేస్తారో కాలపరిమితిని కావాలని సుప్రీం ఆదేశించింది. డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తులు బీసీసీఐలో పదవికి అనర్హులని లోథా కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లోథా కమిటీ సిఫార్సులను బీసీసీఐ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.