హైదరాబాద్: బీసీసీఐలో ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని గత నెలలో లోధా కమిటీ సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణ వచ్చిన ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది.
డిసెంబర్ 14వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చివరిసారిగా ఈ పిటిషన్ను అక్టోబర్ 21న విచారించిన న్యాయస్ధానం గడచిన సోమవారం (డిసెంబర్ 9)న తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే దీనిని డిసెంబర్ 9కి వాయిదా వేసిన ధర్మాసనం మళ్లీ డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
తొలగించండి: బీసీసీఐకి లోథా కమిటీ మరో షాక్
అయితే తాజాగా బెంచ్ ముందు పలు కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో ఈ పిటిషన్ విచారణను మరోసారి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. క్రికెట్లో సంస్కరణల అమలు కోసం సూచించిన లోధా కమిటీ ప్రతిపాదనలను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు లోధా సూచించిన ప్రతిపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్కు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యంగా 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బీసీసీఐ గట్టిగా వ్యతిరేకిస్తోంది.
దీంతో బీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలగించాలంటూ జస్టిస్ లోథా కమిటీ సోమవారం (నవంబర్ 21)న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీసీఐ పరిశీలకుడిగా బాధ్యతలను హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైకి అప్పగించాలని తన నివేదికలో పేర్కొంది.
దాంతో పాటు పిళ్లైకు ఆడిటర్ను, ఇతర పరిపాలనా సిబ్బందిని నియమించడం, వారి జీత భత్యాలు నిర్ణయించే అధికారం ఇవ్వాలని లోధా కమిటీ తన నివేదికలో పేర్కొంది. బీసీసీఐకి ఆడిటర్లను నియమించే బాధ్యతతో పాటు, తదుపరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రచార హక్కుల అంశాన్ని పరిశీలిస్తారని జిస్టిస్ లోథా కమిటీ దాఖలు చేసిన పిటిషన్లో కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్పై విచారణను ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.