హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ అనంతరం ఆగస్టు 20 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. వన్డే సిరిస్లో పాల్గొనబోయే భారత జట్టుని ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనా లంకతో జరిగే వన్డే సిరిస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందుకు అనుకూలంగా ఉన్నాయి. టెస్టు సిరిస్ అనంతరం ఆగస్టు 20 నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.
ఇందులో భాగంగా ఫిటెనెస్ నిరూపించుకోవాల్సిందిగా సురేశ్ రైనాకి సెలక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. 2015 అక్టోబరులో దక్షిణాఫ్రికాపై తన చివరి వన్డేని ఆడిన రైనా ఆ సిరీస్ అనంతరం ఫామ్ కోల్పోవడం, దేశవాళీ మ్యాచ్లు ఆడకపోవడంతో అతడ్ని సెలక్టర్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
A well spent day at #NCA! Always so much to learn from @msdhoni and be inspired 💪 #NCA #Bangalore #inspiring #motivating pic.twitter.com/tywlVIfzxw
— Suresh Raina (@ImRaina) 11 August 2017
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో రైనాకి అవకాశమిచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న కొంత మంది సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉండటంతో రైనాకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా గత వారం రోజులుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిటెనెస్ టెస్టులకి రైనా హాజరవుతున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శిక్షణకు సంబంధించిన కొన్ని ఫోటోలను సురేశ్ రైనా తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో రైనా పునరాగమనం వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.