హైదరాబాద్: ఐదు వరుస టెస్టు విజయాలతో ఈ ఏడాదికి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. విదేశాల్లో పేలవంగా ఆడతామన్న ముద్రను తొలగించుకోవాడనికి 2017లో ప్రయత్నిస్తామని భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా హామీ ఇచ్చాడు. ఇంగ్లాండ్పై 4-0తో సిరిస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆల్ రౌండర్ జడేజా మీడియాతో మాట్లాడాడు.
'నేను, నా జట్టు 2017లో విదేశాల్లో మంచి ప్రదర్శన చేస్తుందని భారత అభిమానులకు హామీ ఇస్తున్నా. విదేశాల్లో భారత్ పేలవ ప్రదర్శన ఇస్తుందన్న ముద్రను తొలగించుకోవాలనే పట్టుదలతో ఉన్నాం' అని చెప్పాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చెన్నైలో జరిగిన చివరి టెస్టులో భారత్ విజయం సాధించడంలో రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్లో తన కెరీర్లోనే జడేజా బెస్ట్ సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో తొలిసారి పది వికెట్లు తీశాడు. చెన్నై టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో అశ్విన్, జడేజాలు అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. బుధవారం ఐసీసీ టెస్టుల్లో టాప్ టెన్ బౌలర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లుగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు.
1974లో బిషన్సింగ్ బేడీ, చంద్రశేఖర్ తర్వాత మళ్లీ ఇప్పుడు అశ్విన్, జడేజాలు తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లుగా రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అశ్విన్ 28 వికెట్లు తీయగా జడేజా 26 వికెట్లు తీశాడు. చెన్నై టెస్టులో 10 వికెట్లు తీసిన జడేజా 66 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.