హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం 28వ పడిలోకి అడుగుపెట్టాడు. దీంతో ముంబైలోని ఓ హోటల్లో రవీంద్ర జడేజాతో పాటు కరుణ్ నాయర్ల పుట్టినరోజుని జట్టు ఆటగాళ్ల మధ్య ఘనంగా నిర్వహించారు. గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా ముంబైకి చేరుకుంది.
దీంతో జడేజాతో పాటుగా కరుణ్ నాయర్ కూడా జట్టు సభ్యుల మధ్య తన 25వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఈ పుట్టినరోజు వేడుకల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఈ వీడియోలో జట్టులోని సహచర ఆటగాళ్లు జడేజా, కరుణ్ నాయర్ ముఖాలకు కేక్ పూసి ఆటపట్టించారు. టీమిండియా అత్యుత్తమ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముందుగా కేక్ తీసుకుని బర్త్ డే బాయ్స్ ముఖాలను కేక్ పూశాడు. కెప్టెన్ కోహ్లీ వారిద్దరికీ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
Happy birthday @imjadeja & @karun126 Say cheese to the cake face :) pic.twitter.com/8NXwNJ7NLL
— BCCI (@BCCI) December 6, 2016