ముంబై : బ్యాటింగ్ కి సంబంధించి విరాట్ తరహాలో దూకుడైన ఆటతీరును కొనసాగించడానికే ఇష్టపడుతానంటున్నాడు టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే. తన బ్యాటింగ్ శైలి గురించి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న రహానే, ఈ మధ్య కాలంలో తాను బ్యాటింగ్ లో మరింతగా రాటుదేలినట్టు చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చే నాటికి.. ప్రస్తుత తన ప్రదర్శనకు ఎంతో తేడా ఉందన్న రహానే.. టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ కోహ్లిలా దూకుడుగా వ్యవహరించడమే తనకు ఇష్టమన్నాడు. గతంలో 2013లో డర్బన్ లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్ గురించి ప్రస్తావించిన రహానే కోహ్లి సలహాతోనే ఆ మ్యాచ్ లో బౌలర్లపై ఎదురు దాడికి దిగి సక్సెస్ అయినట్టు తెలిపాడు.
అప్పట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్ లో విరాట్ తో కలిపి భాగస్వామ్యం నెలకొల్పడం గురించి చెప్పుకొస్తూ.. తొలి ఇన్నింగ్స్ లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నానని గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
అయితే అదే మ్యాచ్ లో డేల్ స్టెయిన్ వేసిన ఓ బంతి తన హెల్మెట్ కి తగలడంతో.. నాన్ స్ట్రైక్ వైపున్న కోహ్లి తన వద్దకు వచ్చి దూకుడుగా ఆడాల్సిందిగా సలహా ఇచ్చాడని, కోహ్లి సలహా మేరకు బౌలర్లపై ఎటాక్ కు దిగి సక్సెస్ అయ్యాయని చెప్పాడు. తాను దూకుడుగా ఆడిన ఆ ఇన్నింగ్స్ లో కోహ్లి తాను కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పామని చెప్పుకొచ్చిన రహానే ఇదే తరహాలో ముందునుంచి తాము ఒకరికొకరం సహకరించుకుంటున్న తీరు బాగుంటుందన్నాడు.
కోహ్లి లాగే తాను దూకుడుగా ఆడడానికే ఇష్టపడతానన్న రహానే దూకుడుకు సంబంధించి కోహ్లి దూకుడుకి, తన దూకుడుకి మధ్య చాలా తేడా ఉందని చెప్పాడు. అయితే క్రీజులో మాత్రం తమ ఇద్దరి కాంబినేషన్ సక్సెస్ అయిందన్నాడు. కాగా, ఇప్పటివరకు కోహ్లి-రహానే కలిసి 21 టెస్టుల్లో భాగస్వామ్యం నమోదు చేయగా 54.70 సగటుతో 1094 పరుగులు చేశారు. ఇందులో మూడు సెంచరీల భాగస్వామ్యం కూడా ఉండడం ఈ ఇద్దరి హిట్ కాంబినేషన్ కి నిదర్శనం.