హోబర్ట్: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ వివాదంలో చిక్కుకున్నాడు. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో డుప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడిన వీడియో అతడిని చిక్కుల్లో పడేసింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా హోబర్ట్లో జరిగిన రెండు టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రెండో మ్యాచ్లో డుప్లెసిస్ నోట్లోని తెల్లని పదార్ధంతో బంతిని రబ్ చేసే వీడియో ఫుటేజీ ఈ వివాదానికి కారణమైంది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 54వ ఓవర్లో బంతిని రబ్ చేయడానికి ముందు డుప్లెసిస్ ఓ తెల్లని పదార్ధాన్ని నోట్లో ఉంచుకుని వేళ్లను చప్పరించాడు.
అనంతరం బంతిని రబ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తోంది. దాంతో ఈ సంఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దర్యాప్తునకు ఆదేశించింది. డుప్లెసిస్ చర్యలు ఐసీసీ నిబంధనల నియామవళిని ఉల్లంఘించేలా ఉన్నాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ అన్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని మరో ఐదు రోజుల్లో దీనిపై నిర్ణయం వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఈ బాల్ టాంపరింగ్ వివాదం లెవెల్ 2 నిబంధనలకు వస్తుందని క్రీడా పండితులు అంటున్నారు. ఈ ఘటనపై అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు మ్యాచ్ అధికారులు కానీ ఫిర్యాదు చేయలేదు.
ఈ ఘటనలో డుప్లెసిస్ దోషి అని తేలితే అతడి మ్యాచ్ ఫీజులో 50 నుంచి 100 శాతం వరకు కోత విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా 2-0తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.