కోల్కత్తా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సోమవారం ఎన్నికైన జగ్మోహన్ దాల్మియా క్రికెట్ బోర్డులో మళ్లీ తనదైన హవా కొనసాగించనున్నారు. 10 ఏళ్ల కాలం తర్వాత మళ్లీ పగ్గాలు చేపట్టడంపై ఆయన్ని కోల్కత్తా విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం స్పందించారు.
"ఒకప్పుడు నన్ను బహిష్కరించిన వారే (క్రికెట్ బోర్డు) ప్రస్తుతం నన్ను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు. కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంపుకు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే దాల్మియా, ఠాకూర్ కలిసి పని చేస్తారా అన్న ప్రశ్నకు గాను "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభివృద్ధి కోసం ఓ జట్టుగా మేము కలసి పని చేస్తాం" అని దాల్మియా అన్నారు.
1996 వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి ఆర్ధక అవకతవకలు జరిగాయంటూ 2006లో జగ్మోహన్ దాల్మియాని క్రికెట్ బోర్డు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో బీసీసీఐ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఉండగా, అతనికి ఎన్ శ్రీనివాసన్, నిరంజన్ షా, శశాంక మనోహార్లు మద్దతుగా నిలిచారు.
జైపూర్లో నిర్వహించిన స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్జీఎమ్)లో క్రికెట్ బోర్డు నుంచి దాల్మియాను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 29 మంది సభ్యులు దాల్మియాను తప్పించాల్సిందిగా ఓటు వేశారు. దాల్మియాకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ కూడా జారీ చేయబడిన విషయం తెలిసిందే. ఆరోజు న్యాయస్ధానం ముందు దోషిగా నిలబడ్డ దాల్మియా ఈరోజు మళ్లీ తిరిగి భారత క్రికెట్ను తన చేతిలోకి తెచ్చుకున్నారు.