హైదరాబాద్: న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు సిరిస్లో బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. బుధవారం డబ్లిన్లో జరిగిన వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్పై బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ను విదేశీ గడ్డపై ఓడించడం బంగ్లాదేశ్కు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 270 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్కు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో లాథమ్(84), బ్రూమ్(63), రాస్ టేలర్(60 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు.
రెండో వికెట్కు కివీస్ 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 271 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లలో సౌమ్య సర్కార్ డకౌట్గా అవుటైనప్పటికీ, మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(65) రాణించాడు.
అతనికి జతగా షబ్బిర్ రెహ్మాన్(65) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో రెండో వికెట్కు బంగ్లాదేశ్ 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్(45 నాటౌట్), మొహ్మదుల్లా(46)లు రాణించడంతో బంగ్లాదేశ్ 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.
బంగ్లాదేశ్ ఆటగాడు ముష్పికర్ రహీమ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా, మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు న్యూజిలాండ్కు చెందిన లాథమ్కు దక్కింది. తాజా విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకుల్లో బంగ్లాదేశ్ ఆరో స్ధానానికి ఎగబాకింది.