ట్రినిడాడ్: టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన క్రిస్ గేల్ రికార్డు బద్దలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
అయితే ఇప్పుడు ఆ రికార్డుని ట్రినిడాడ్ అండ్ టొబాగో యువ క్రికెటర్ ఇరాక్ థామస్ బద్దలు కొట్టాడు. 2013లో క్రిస్ గేల్ నమోదు చేసిన ఈ రికార్డు కేవలం మూడేళ్లలోనే బద్దలవడం విశేషం. కేవలం 21 బంతుల్లో సెంచరీని సాధించిన ఇరాక్ థామస్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్బారో తరఫున బరిలోకి దిగిన అతను, స్పీ సైడ్ టీమ్పై ఈ ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసున్న థామస్ తన ఇన్నింగ్స్లో మొత్తం 31 బంతులను ఎదుర్కొని 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
ప్రత్యర్ధి జట్టు విసిరిన ప్రతి బంతిని తన విధ్వంసక బ్యాటింగ్తో మైదానంలో పరుగుల సునామీని సృష్టించాడు. థామస్ చేసిన 131 పరుగుల్లో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. గతంలో ట్రినిడాడ్ జట్టులో అండర్-13 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను, జాతీయ అండర్-19 ప్రాబబుల్స్లో కూడా ఉన్నాడు.
టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని థామస్ అన్నాడు. ఇదిలా ఉంటే 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ జట్టుపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.