పుణె : వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పట్టుకున్న క్యాచ్కు భారత బౌలర్ ఉమేష్ యాదవ్ తబ్బిబ్బయినట్లే ఉన్నాడు. సాహాను ఆకాశానికెత్తాడు. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఉమేష్ యాదవ్ బౌలింగుకి ఆస్ట్రేలియన్లు కంగారెత్తిపోయారు. మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసిన ఉమేష్ బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ వార్నర్ బౌల్డ్ అయ్యాడు. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లపైకి దూసుకుపోయింది.
వికెట్ కీపర్ వేడ్, ఓ కీఫీ, లియాన్ వికెట్లు కూడా ఉమేష్ యాదవ్కే దక్కాయి. ఓ ఇన్నింగ్స్లో ఇది అతని ఉత్తమ ప్రదర్శన. మ్యాచ్ ముగిసిన తర్వాత ఉమేష్ వికెట్ కీపర్ సాహాపై ప్రశంసలు కురింపాచుడు. ఎవరైనా అలాంటి క్యాచ్ పట్టినప్పుడు బౌలర్కు వెయ్యేనుగుల బలం వస్తుందని, బంతి వేగంగా దూసుకుపోతున్నప్పుడు సాహాలా పట్టిన క్యాచ్లు చాలా తక్కువ అని అన్నాడు.
దాంతో ఆగకుండా - సాహాకు హ్యాట్సాఫ్ అన్నాడు. కష్టసాధ్యమైన క్యాచ్లు పట్టే సామర్థ్యం తనకుందని సాహా నిరూపించాడని అన్నాడు. కీఫీ బ్యాట్ అంచును తాకి దూరంగా వెళుతున్న బంతిని సాహా గోల్ కీపర్లా డైవ్ చేసి ఒంటిచేత్తో అందుకున్నాడు.
ఎంత మంది బౌలర్లను మార్చినా 27 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడని స్థితిలో కెప్టెన్ కోహ్లీ - ఉమేష్కు బంతిని ఇచ్చాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఉమేష్ నిలబెట్టుకున్నాడు. తన మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో మొదటి రోజు జరిగిన ఓ సంఘటన భారత్కు తీరని వ్యధను మిగిల్చింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జయంత్ బౌలింగ్లో వార్నర్ పూర్తిగా ఆఫ్ సైడ్ వచ్చి ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో అతడు బతికిపోయాడు.
అప్పటి వరకు నిదానంగా ఆడిన వార్నర్ తనక వచ్చిన లైఫ్ను వినియోగించుకున్నాడు. తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారిన వార్నర్ను ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఉమేష్ క్లీన్ బౌల్డ్ చేశాడు.