హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, బీసీసీఐల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నెలకొని ఈ ఏడాది నవంబర్కు 25 వసంతాలు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇరు జట్ల మధ్య ఫ్రెండ్షిప్ సిరిస్ను నిర్వహించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమను సంప్రదించకుండా ఏకపక్షంగా షెడ్యూల్ రూపొందించడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే (డిసెంబర్ 26) టెస్టు ఆడేది లేదని బోర్డు స్పష్టం చేసింది.
అంతేకాదు దక్షిణాఫ్రికా బోర్డుపై బీసీసీఐ నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా హరూన్ లొర్గాత్ దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ అయినప్పటికీ నుంచీ ఇరు దేశాలకు చెందిన బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ సిరిస్ జనవరి 10 తర్వాతే మొదలవుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
రెండు దేశాలకు, ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా భారత్లాంటి దేశంతో టెస్టు అంటే సిరీస్ బాగా లాభాలను తెచ్చిపెడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుని దెబ్బ కొట్టాలని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
బీసీసీఐకి ఎక్కడ చెడింది?
ఈ సిరిస్కు ముందు రెండు వామప్ మ్యాచ్లు కావాలని బీసీసీఐ ఎప్పటి నుంచో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుని అడుగుతోంది. బీసీసీఐ సూచనను ఏ మాత్రం పట్టించుకోకుండా వార్మప్ మ్యాచ్లు లేకుండా ఏకపక్షంగా షెడ్యూల్ను రూపొందించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ హరూన్ లొర్గాత్.. బీసీసీఐ అధికారులు ఒకే హోటల్లో బస చేసినప్పిటకీ, షెడ్యూల్పై చర్చించలేదు. అంతేకాదు ఎప్పుడో మార్చి 1 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ను మాత్రం లొర్గాత్ ముందుగానే ఓకే చెప్పేయడం బీసీసీఐని మరింత అసంతృప్తికి గురిచేసింది.
మరోవైపు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు సిరిస్ నుంచే కోహ్లీసేన తన వరుస విజయపరంపరను కొనసాగించాలనే యోచనలో ఉంది. అయితే దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై ఓడించడం అంటే కష్టంతో కూడుకున్న పనే. ఈ 25 ఏళ్ల కాలంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. 2006లో వాండరర్స్, 2010లో కింగ్స్మీడ్లలో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది.