న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి జార్ఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఉండే అవకాశాన్ని టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తిరస్కరించనున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ధోని కుటుంబ సభ్యులు, స్నేహితుడు ఒకరు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అమరేంద్ర ప్రతాప్సింగ్ గత నెలలో ధోనీని కలిసి స్వచ్ఛభారత్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కోరారంట.
అయితే ధోని ఈ విషయంపై వారికి ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. అంతేకాదు జార్ఖండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ అవకాశాన్ని కూడా ధోనీ తిరస్కరించనున్నారని తెలుస్తోంది. ధోని ఇప్పటికే, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, పల్స్ పోలియో, అక్షరాస్యత తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.
అయితే ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని, ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉందని ధోని అభిప్రాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని తెలుస్తోంది.
అందుకే ఇక ముందు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ధోనికి అత్యంత సన్నిహిత స్నేహితుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే, రాంచీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం కూడా ధోనీ అసంతృప్తికి ఒక కారణంగా పేర్కొన్నాడు.
జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోని కుటుంబ సభ్యులతోనే జార్ఖండ్ రాజధాని రాంచీలోనే ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ధోని నిరాకరించారు.