న్యూఢిల్లీ: ఆ క్రికెటర్ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఒంటికాలుపై పరిగెత్తి బంతిని అందుకుని కీపర్ వైపుకు విసిరాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ తర్వాత ఊడిపోయిన తన కృత్రిమ కాలును ధరించాడు. అతను చూపిన క్రీడాస్ఫూర్తి స్టేడియంలోని ప్రేక్షకులందరినీ కదిలించింది. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లను మెప్పించడంతో పాటు అందరి మన్ననలను అందుకున్నాడు. దుబాయిలో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్ టీ20 టోర్నీ ఫైనల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
టోర్నీలో భాగంగా ఫైనల్స్లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్తో తలపడింది. లియామ్ థామస్ దివ్యాంగుడు. ఇంగ్లాండ్ దివ్యాంగుల క్రికెట్ జట్టులోసభ్యుడు. ఈ మ్యాచ్లో అతడు అసాధారణ ప్రతిభ చూపాడు. పాకిస్థాన్ ప్లేయర్ మిడ్ వికెట్ దిశగా భారీషాట్ కొట్టాడు. ఈ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న థామస్ డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేసాడు.
అయితే ఇంతలోనే అనూహ్యంగా అతడు ధరించిన కృత్రిమకాలు ఊడిపోయింది. బంతి అతన్ని తగిలి కాస్త దూరంగా వెళ్లింది. అయినా ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని కీపర్కు విసిరాడు. బంతి విసిరే సమయంలో కృత్రిమకాలు ఊడిపోవడంతో, కుడికాలు మోకాలును మైదానంలో నిలిపి కూర్చున్న భంగిమలో బంతిని కీపర్ వైపుకు విసిరాడు.
ఆ తర్వాత ఊడిపోయిన కృత్రిమకాలు వద్దకు వెళ్లి దానిని ధరించాడు. దీంతో అతని క్రీడాస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై పాక్ విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం ఈ సంఘటనపై లియామ్ థామస్ మీడియాతో మాట్లాడాడు. 'ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బంతిని అందుకునే క్రమంలో భూమిని బలంగా ఢీకొన్నా. ఆ తర్వాత నేను లేచేందుకు ప్రయత్నించగా ఒక కాలు లేదు. ముందు ఊడిపోయిన కాలును పెట్టుకోవాలా? లేక బంతిని అందుకోవాలా? అన్న సందిగ్ధ పరిస్థితి. కానీ బంతికే నేను ప్రాధాన్యం ఇచ్చాను' అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపారు.