హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు బస చేసిన ఢిల్లీలోని ద్వారకలోని వెల్కం హోటల్లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మంటల్లో జార్ఖండ్ క్రికెట్ జట్టు క్రికెట్ కిట్ పూర్తిగా కాలిపోయింది. అయితే హోటల్ సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
బూడిదైన క్రికెట్ కిట్, మ్యాచ్ వాయిదా: ధోనికి తప్పిన పెను ప్రమాదం
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 30 ఫైరింజన్లతో గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ధోనితో పాటు హోటల్లో బస చేసిన మిగతా క్రికెటర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన అనంతరం ధోనితో పాటు జార్ఖండ్ జట్టుని సెంట్రల్ ఢిల్లీలోని వేరోక హోటల్కి మార్చారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శుక్రవారం బెంగాల్, జార్ఖండ్ జట్ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ని శనివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నిర్వహించనున్నారు. మరోవైపు శనివారం జరగాల్సిన పైనల్ మ్యాచ్ని ఇదే స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.
మహారాష్ట్రతో జరిగిన ఉత్కంఠకర క్వార్టర్స్లో బెంగాల్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్లో ధోని సేనపై విజయం సాధించి పైనల్స్కు అర్హత సాధించేందుకు బెంగాల్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ, కోచ్ సైరాజ్ బహుతులె క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని కలిశారు.
ధోని నేతృత్వంలోని జార్ఖండ్ జట్టుపై విజయం సాధించేందుకు గంగూలీ ఇప్పటికే కొన్ని వ్యూహాలు సిద్ధం చేశారని, మ్యాచ్కు సైతం హాజరు కానున్నట్లు సమాచారం. విజయ హజారే ట్రోఫీలో తొలిసారి జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన ధోని తన జట్టను పైనల్కు చేర్చాలనే తలంపుతో ఉన్నాడు.
దీంతో ధోని వ్యూహానికి గంగూలీ ప్రతివ్యూహాం పన్నేలా ఇరు జట్లు ఆలోచిస్తాయి. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే బెంగాల్ జట్టులో ఐపీఎల్ అనుభవం ఉన్న మనోజ్ తివారీ, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాలు ఉన్నారు.