ముంబై: పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడిందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసించాడు.. అయితే కోహ్లీసేన ఇప్పటికీ సిరీస్ గెలవగలదని బలంగా నమ్ముతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. 'పుణెలో ఆస్ట్రేలియా బాగా ఆడింది. భారత్ను 105, 107కు ఆలౌట్ చేయడం గొప్ప విషయం. కానీ భారతే ఇప్పటికే సిరీస్ గెలుస్తుందని నేను నమ్ముతున్నా' అని గంగూలీ అన్నాడు.
పుణెతో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎదుర్కొన్న రెండో బంతికి, రెండో ఇన్నింగ్స్లో ఒకీఫ్ బౌలింగ్లో 0, 13 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. కోహ్లీ డకౌట్ అవ్వడం స్వదేశంలో తొలిసారి కాగా కెరీర్లో ఐదోది. కాగా, కోహ్లీ వైఫల్యంపైనా గంగూలీ స్పందించాడు.
'కోహ్లీ మానవ మాత్రుడు. అతడూ ఎప్పుడో ఓసారి విఫలం అవుతాడు. పుణెలో రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఆఫ్స్టంప్ ఆవల పడ్డ చెత్త బంతికి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో 441 పరుగుల లక్ష్య ఛేదన అంత సులభం కాదు. రెండో టెస్టులో విరాట్ గొప్పగా ఆడతాడు. ఆసీస్పై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది' అని గంగూలీ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాలో గతంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో కోహ్లీ నాలుగు శతకాలు బాది 692 పరుగులు చేశాడు. ఎల్లప్పుడూ విజయాలు సాధించడం కుదరదని గంగూలీ అన్నాడు. 'సొంతగడ్డపై ఓడిపోవడం సహజమే. ఎన్నో జట్లు అలా ఓడాయి. ఇదే తొలిసారి కాదు. దీని గురించి ఇక మరిచిపోవాలి. విశ్రాంతి తీసుకుని బెంగళూరులో బరిలోకి దిగాలి' అని చెప్పాడు.
డీఆర్ఎస్ను భారత్ మెరుగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరముందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. వచ్చే టెస్టుకు స్పిన్నర్ జయంత్ యాదవ్ను తప్పించాలని అన్నాడు. 'నేనైతే వచ్చే టెస్టుకు జయంత్ యాదవ్ను తప్పించి అదనపు బ్యాట్స్మన్ను తీసుకుంటా. కరుణ్ నాయర్కు అవకాశం ఇవ్వాలి. అజింక్య రహానె ఆత్మవిశ్వాసలేమితో కనిపిస్తున్నాడు. భారత్లో నలుగురు బౌలర్లు చాలు. టెస్టు మ్యాచ్ల్లో ఇద్దరు స్పిన్నర్లు 20 వికెట్లు తీయగలరు. బౌలర్లు సుదీర్ఘ స్పెల్లు బౌలింగ్ చేయాలి. అశ్విన్, జడేజాలకు ఆ సామర్థ్యం ఉంది' అని గంగూలీ చెప్పాడు.