హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ పాలనా కమిటీ(సీఓఏ)కి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ పే విధానం ప్రకారం గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ. 2 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లు రూ. 1 కోటి, గ్రేడ్ సీ ఆటగాళ్లు రూ. 50 లక్షలు పొందుతున్నారు.
అయితే తాజాగా ఆటగాళ్ల ఫీజులు 150 శాతం పెంచాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్లో సీఈఓ రాహుల్ జోహ్రీ, జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరిలకు పూర్తి నివేదికను అందజేశారు. అన్నిఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు సీజన్కు రూ. 5 కోట్లు పెంచాలని కోరారు. ఈ కొత్త ప్రతిపాదన కనుక అమలైతే ధోనికి చెల్లించే వేతనంలో కోత పడనుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు క్రికెటర్లకు అత్యధిక మొత్తం చెల్లించాలి. ఆ తర్వాత జాబితాలో వన్డేలు, టీ20 ఆటగాళ్లుండాలి. అంటే ఈ ప్రతిపాదన ఐపీఎల్ ఆడని చటేశ్వర పుజారా లాంటి క్రికెటర్కు లాభిస్తుండగా, టెస్టు క్రికెట్కు దూరమైన ధోనిపై ప్రభావం చూపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని 'ఏ' కేటగిరీలో ఉన్న ధోనీ వన్డేలకే పరిమితమయ్యాడు. అంటే ఈ ప్రతిపాదన అమలైతే ధోనికి ఆర్దికంగా నష్టం తప్పదు. 'ఏ' గ్రేడ్ లో ఉండి కూడా రెండు కోట్లు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. కొత్త విధానాన్ని ఆమోదిస్తే ధోని కేటగిరీ మారుతుంది.
అయితే అతడి కేటగిరీని మారుస్తారా లేక ప్రస్తుత కేటగిరీలో కొనసాగేలా మినహాయింపు ఇస్తారా.. చూడాలి. ఈ నెల 26వ తేదీన జరిగే బీసీసీస సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది.