ముంబై: పాకిస్తాన్లో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న క్రికెటర్ కంటే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వంద రెట్ల ఆదాయం సంపాదిస్తున్నాడు. పాక్లో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రికెటర్ మహ్మద్ హఫీజ్. అతనికి 2015-16 సంవత్సరంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి రూ.2.49 కోట్ల ఆదాయం వచ్చింది.
మహ్మద్ హఫీజ్ ఆదాయందతో పోలిస్తే భారత టెస్ట్ కెప్టెన్ కోహ్లీ ఎంతో ఎత్తులో ఉన్నాడు. బీసీసీఐ నుంచి వేతనం, మ్యాచ్ ఫీజులు, యాడ్స్ తదితరాల నుంచి కోహ్లీకి గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.308 కోట్లు అందాయి.
పాకిస్తాన్లోని 46 మంది క్రికెటర్లకు అందిన ఫీజు మొత్తం రూ.100 కోట్లను కూడా దాటలేదని తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, శ్రీలంక జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో మరే ప్రదాన జట్టూ అక్కడ పర్యటించేందుకు అంగీకరించక పోవడంతోనే పీసీబీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆ ప్రభావం ఆటగాళ్లపై పడిందని అంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐ. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యధిక ఫీజును చెల్లించే వెసులుబాటూ ఉంది. బీసీసీఐతో పోలిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక స్థిరత్వం తక్కువే.
అంతేకాదు, ఆదరణ, విశ్వసనీయతలో కూడా ప్రకటన కంపెనీలు పాకిస్తాన్ క్రికెటర్ల కంటే భారత్ క్రికెటర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఇలా ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించే ఏ అంశంలోనూ భారత్ క్రికెటర్లకు కనీసం పోటీనివ్వలేని పాకిస్తాన్ ఆటగాళ్లు సహజంగానే ఆదాయం పొందే విషయంలో వెనుకబడి ఉన్నారు.