బెంగళూరు: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్లు ఒకరినొకరు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అనుసరించడం లేదు (ఫాలో కావడం లేదు). ఇద్దరు కూడా ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే.
2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా కోహ్లీ, గంభీర్లు ఒకరిని మరొకరు తిట్టుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత రెండేళ్లకు మరోసారి అదే టోర్నమెంటులో తగువులాడుకున్నారు.
ఐపీఎల్లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కాగా, గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్. రెండేళ్ల తర్వాత ఇటీవలే గంభీర్ టెస్టుల్లో భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్లో ఆడాడు. ఈ సిరీస్ను భారత్ గెలుచుకుంది. మూడో టెస్ట్ ఇండోర్లో జరిగింది.
అంతకుముందు రెండో టెస్ట్ కోల్కతాలో జరిగింది. ఆ సమయంలో ఈడెన్ గార్డెన్లో ట్రెయినింగ్ సెషన్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ నవ్వుతూ ఫోటోలకు చిక్కారు. దీంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందనుకున్నారు.
కాని అదే కోల్కతా టెస్టుకు కోహ్లీ.. గంభీర్ను తీసుకోలేదు. దీంతో అభిమానులు కోహ్లీ పైన విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ఇరువురు కూడా మైదానంలో మంచి కాంపిటీటర్స్. దూకుడుగా ఉంటారు. ఇద్దరూ ఢిల్లీ నుంచే వచ్చారు. కానీ ఇరువురి మధ్య మంచి సంబంధాలు కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా, ట్విట్టర్లో కోహ్లీ 39 మందిని ఫాలో అవుతున్నాడు. అందులో సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తదితర క్రికెటర్లు ఉన్నారు. గానీ గంభీర్ లేడు. గంభీర్ 81 మందిని ఫాలో అవుతున్నాడు. అందులో కోహ్లీ లేడు.