హైదరాబాద్: రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ రహానేపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో వెస్టిండిస్పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఒక టెస్టు బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన రహానే పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్నాడని కొనియాడాడు.
'ఈ సిరీస్లో రహానే బ్యాటింగ్ చూడండి. అద్భుతంగా ఉంది. ప్రధానంగా వన్డే సిరీస్లకు తగ్గట్టుగా రహానే బ్యాటింగ్ సాగుతోంది. మాకు మూడో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ రహానే రూపంలో ఉండటం జట్టు బలాన్ని తెలియజేస్తుంది. రహానే ఎప్పుడూ పెద్దగా ఒత్తిడి తీసుకోకుండానే ఆడతాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'ఈ మ్యాచ్లో గేమ్ను ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం రహానేలో నాకు కనబడిన లక్షణం. భారత జట్టు సమతుల్యంగా ఉండటానికి రహానే పాత్ర కూడా కారణం. వరల్డ్ కప్ వంటి మేజర్ టోర్నీల్లో ఆడేటప్పుడు అదనపు బ్యాట్స్మెన్ గురించి కాకుండా అదనపు బౌలర్ గురించి ఆలోచించే పరిస్థితిని రహానే కల్పించాడు' అని పేర్కొన్నాడు.
'రహానే వల్ల అదనంగా ఒక బౌలర్ను జట్టు వెంట సంకోచం లేకుండా తీసుకెళ్లవచ్చు. విండీస్ పర్యటనకు 15 మంది ఆటగాళ్లతో వెళ్లాం. స్వదేశంలో మరో 10 నుంచి 12 మంది ఆటగాళ్ల కూడా ఉన్నారు. ఒత్తిడిలో ఎలా ఆడతారు అనే దానిపై వారిని పరిశీలిస్తున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డే విజయంతో ఐదు వన్డేల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య జూన్ 30న మూడో వన్డే ఆంటిగ్వాలో జరగనుంది.