హైదరాబాద్: కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 1 నాటికి టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో ఉంటే కోహ్లీసేన రూ. 6.6 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో తేల్చే టెస్టు మార్చి 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో ఉంది. ధర్మశాలలో జరిగే చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా కోహ్లీసేన ఈ నగదు బహుమతిని అందుకోనుంది.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మరోవైపు కటాఫ్ తేదీ ఏప్రిల్ 1 నాటికి రెండో స్ధానంలో ఉన్న జట్టు $500,000 నగదు బహుమతిని అందుకోనుంది. రెండో స్ధానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ధర్మశాలలో భారత్తో జరగనున్న చివరి టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగిస్తే టెస్టు ర్యాంకుల్లో రెండో స్ధానంలో నిలుస్తుంది. అలా కాకుండా ధర్మశాల టెస్టులో ఆసీస్ ఓటమి పాలైతే దక్షిణాఫ్రికా రెండో స్ధానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా... న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.
హామిల్టన్లో జరిగే టెస్టులో న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా డ్రాగా ముగించినా లేదా విజయం సాధించినా రెండో స్ధానంలో నిలుస్తుంది. ఇక కటాఫ్ తేది ఏప్రిల్ 1 నాటికి మూడో స్ధానంలో నిలిచిన జట్టు $ 200,000 నగదు బహుమతిని, నాలుగో స్ధానంలో నిలిచిన జట్టు $ 100,000 బహుమతిని అందుకోనుంది.
ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా 121 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 109 పాయంట్లతో రెండో స్థానంలో ఉంది. టాప్ ర్యాంకర్లో ఉన్న టీమిండియాకు ఆసీస్ మధ్య 12 పాయింట్ల వ్యత్యాసం ఉంది. మిగతా రెండు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 1 నాటికి భారత ర్యాంకులో మార్పుండదు.
మార్చి 21, 2017 నాటికి ఐసీసీ టెస్టు ర్యాంకులు:
1. భారత్ 121 Rating Points
2. ఆస్ట్రేలియా 109
3. దక్షిణాఫ్రికా 107
4. ఇంగ్లాండ్ 101
5. న్యూజిలాండ్ 98
6. పాకిస్థాన్ 97
7. శ్రీలంక 90
8. వెస్టిండిస్ 69
9. బంగ్లాదేశ్ 66
10. జింబాబ్వే 55