హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్లో చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ అనంతరం పరిమిత ఓవర్ల సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ సమయంలో కోహ్లీ అభిమానులకు ఓ చేదువార్త. భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే ఏకైక టీ20 మ్యాచ్కి కోహ్లీ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస సిరిస్ల కారణంగా కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇందులో భాగంగా కోహ్లీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి టీ20 నుంచి తప్పించి విశ్రాంతి కల్పించనున్నట్లు సమాచారం. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్ పర్యటన ముగించుకుని ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది.
వరుస పర్యటనలతో ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా గడుపుతున్నారని, ఈ క్రమంలో వారికి విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. గత ఏడాది కాలంలో టీమిండియా ఆడిన 43 మ్యాచ్ల్లో కోహ్లీ గాయం కారణంగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్కి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టుకి దూరమైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఐపీఎల్ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య సెప్టెంబర్ 6వ తేదీన జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్కి కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అందించాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడంతో యువ ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆతిథ్య శ్రీలంకతో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 20న తొలి వన్డే ప్రారంభం కానుంది.