హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్కు తొలి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే టీమిండియాపై స్పందించాడు.
'కోహ్లీ ఫామ్ ఆందోళనకరం కాదు. అతడి సామర్థ్యం, ప్రతిభ నాకు తెలుసు. అతడు తిరిగి పుంజుకొంటాడు. అతడు పరుగులు సాధించకపోవడానికి కారణాలేమీ కనిపించడం లేదు' అని కపిల్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ పుంజుకుంటాడని కపిల్దేవ్ ధీమా వ్యక్తం చేశాడు.
'టీమిండియాలో కోహ్లీ అత్యంత కీలక ఆటగాడు. అతడు పరుగులు చేయడం మొదలు పెడితే జట్టు అంతా ప్రేరణ పొందుతుంది. కెప్టెన్ పరుగులు చేస్తోంటే అంతకన్నా ఉత్తమం ఏముంటుంది' అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో ఆడుతుండటంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు అదే ధోని కోహ్లీ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు.
అంతేకాదు ధోని ఎక్స్ పీరియన్స్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడనే అనేది కూడా కోహ్లీకి ఎంతో కీలకమని కపిల్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టు బాగుందని అన్నాడు. బౌలర్లు, బ్యాట్స్మెన్తో సమతూకంగా ఉందని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రాణించాలంటే మిడిలార్డర్లో ధోని, యువరాజ్ సింగ్ నిలబడడం ఎంతో ముఖ్యమని కపిల్ దేవ్ తెలిపాడు.