హైదరాబాద్: కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియాన విజయాల బాట పట్టిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా ఛేజింగ్లో తనకు తిరుగు లేదని కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ (132)తో పాటు కోహ్లీ (82) పరుగులతో అజేయంగా నిలవడంతో శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 44వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న కోహ్లీ ఛేదనలో అత్యంత వేగవంతంగా 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.
ఇప్పటివరకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 124 ఇన్నింగ్స్ ల్లో నాలుగు వేల పరుగులు (ఛేజింగ్లో) ఈ మైలురాయిని అందుకుని భారత్ తరుపున అగ్రస్ధానంలో ఉండగా, విరాట్ కోహ్లీ కేవలం 64 ఇన్నింగ్స్ల్లోనే అందుకుని సచిన్ రికార్డుని అధిగమించాడు. ఇక ఆసీస్ క్రికెటర్ పాంటింగ్ ఇదే మైలురాయిని 104 ఇన్నింగ్స్లో అందుకున్నాడు.
ఇదిలా ఉంటే ఛేదనలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మాత్రం సచిన్ టెండూల్కర్ 5490 పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతుడంగా అతని తర్వాత రికీ పాంటింగ్ 4186.. ప్రస్తుతం కోహ్లీ 4001 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఘనతను సాధించే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజి 100.02గా ఉండటం విశేషం.
ఇక, సచిన్ 55.45 యావరేజితో, రికీ పాంటింగ్ 57.34 సగటుతో మాత్రమే ఈ ఘనతను సాధించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 28 వన్డే సెంచరీలున్నాయి. అందులో ఛేజింగ్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీలు 18. ఇందులో 16 సెంచరీలు టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాయి.