న్యూఢిల్లీ: అద్భుత ఫాంతో కొనసాగుతున్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతూ ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రికెట్లో అతని విలువెంటో మనకు తెలుసు కానీ.. ఇప్పుడు అతను ప్రచారకర్తగా వ్యవహరించే ఉత్పత్తి సంస్థలకు కూడా అతని విలువేంటో తెలిసిపోయింది.
కాగా, ఓ ఆటగాడు ఓ ఉత్పత్తికి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? ఏ స్థాయిలో ఆ ఉత్పత్తి విజయవంతమవుతుంది? ఎంత మంది వినియోగదారులపై ఆ ప్రచారం ప్రభావం చూపుతుంది? ఇలాంటి అంశాలపై సర్వే చేసే స్పోర్ట్స్ ప్రో సంస్థ... ప్రపంచంలోనే విరాట్ కోహ్లీకి మూడో ర్యాంకు ఇచ్చింది.
అంటే, స్పోర్ట్స్ ప్రొ' మ్యాగజైన్ సర్వే ప్రకారం 'అత్యధిక మార్కెటింగ్ సామర్థ్యం ఉన్న క్రీడాకారుల'లో కోహ్లికి మూడో స్థానం దక్కింది. ఫుట్బాల్ స్టార్ మెస్సీ, జొకోవిచ్లను వెనక్కి నెట్టి కోహ్లి ఈ స్థానంలో నిలవడం విశేషం. ఎన్బీఏ ఆటగాడు స్టీఫెన్ కర్రీ, ఫ్రెంచ్ ఫుట్బాలర్ పాల్ పోగ్బా స్పోర్ట్స్ ప్రొ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
టాప్-50లో చోటు దక్కించుకున్న మరో భారత ప్లేయర్ సానియా మీర్జా కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల ప్రదర్శన, వయసు, పాపులార్టీ, ఇతర దేశాల్లోనూ ఉన్న గుర్తింపు, వారితో ఉన్న బ్రాండింగ్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అధ్యయనం చేసే స్పోర్ట్స్ ప్రొ గత ఏడేళ్లుగా ఈ జాబితాను ప్రకటిస్తోంది.