హైదరాబాద్: గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మనకు తెలిసిందే. అయితే అనుష్కతో తన బంధాన్ని మాత్రం కోహ్లీ ఇప్పటివరకు బయటకు చెప్పలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లిలో అనుష్కతో కలిసి కోహ్లీ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ తర్వాత వీరిద్దరూ పూర్తిగా ప్రేమలో మునిగిపోయారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే అనుష్కతో తన పెళ్లి వార్తను ఖండించిన కోహ్లీ వీరిద్దరి ప్రేమాయణంపై మాత్రం నోరు మెదపలేదు. అయితే తాజాగా అనుష్కతో తన బంధానికి సంబంధించి ఓ విషయాన్ని కోహ్లీ బయటపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా లండన్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్ట్స్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అనుష్క ముందు తాను కంటతడి పెట్టినట్లు చెప్పాడు. అయితే అవి ఆనంద బాష్పాలని కోహ్లీ చెప్పాడు. గతేడాది నవంబర్లో ఇంగ్లాండ్తో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా అనుష్క.. తనతో ఉన్నదని కోహ్లీ తెలిపాడు.
అప్పుడే తనను వన్డే, టీ20లకు కూడా కెప్టెన్ను చేస్తున్నట్లు ఫోన్ వచ్చిందని, ఈ విషయాన్ని అనుష్కతో చెప్పినప్పుడు తాను కంటతడి పెట్టినట్లు కోహ్లీ చెప్పాడు. తనను టెస్ట్ కెప్టెన్ను చేసినప్పుడు కూడా మెల్బోర్న్లో తనతో అనుష్క ఉందని, ఆమె తన అదృష్ట దేవత అని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరగనున్న సెమీ పైనల్స్లో టీమిండియా... బంగ్లాదేశ్తో జూన్ 15 (గురువారం) తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా ఫైనల్స్కు చేరుతుంది.