హైదరాబాద్: ఇటీవల కాలంలో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ధావన్ తన దూకుడును ఇదేవిధంగా కొనసాగించాలని, ఇదే 'హ్యాపీజోన్'లో ఉంటూ టీమిండియాకు మరిన్ని విజయాలు అందించాలని పేర్కొన్నాడు.
'గత మూడు నెలలుగా ధావన్ గొప్పగా ఆడుతున్నాడు. బ్యాటింగ్లో అతని విజయపరంపర కొనసాగుతోంది. ఇదే హ్యాపీజోన్లో అతను కొనసాగుతూ జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి అతను దూకుడు మొదలుపెట్టాడంటే అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు' అని మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో అన్నాడు.
దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. 90 బంతుల్లో 132 పరుగులు చేసిన టీమిండియాకు అలవోక విజయాన్ని అందించాడు. ధావన్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (70 బంతుల్లో 82 పరుగులు) కూడా చెలరేగాడు.
దీంతో 127 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. వీరిద్దరూ అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు 200పై చిలుకు లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లో ఛేజ్ చేసి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.
India won the match with 127 balls to spare- their biggest ever win while chasing a 200+ target. #SLvIND #INDvSL
— Rajneesh Gupta (@rgcricket) 20 August 2017