సెహ్వాగ్ పంపించిన రెజ్యూమ్ చూసి బిత్తరపోయిన బీసీసీఐ
ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ పదవి కోసం సెహ్వాగ్ పంపించిన రెజ్యూమ్ చూసి బీసీసీఐ బిత్తరపోయింది. కేవలం రెండంటే రెండే లైన్లలో కోచ్ పదవి కోసం వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ‘ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్, కోచ్గా ఉన్నాను. ఈ (టీమిండియా) బాయ్స్ అందరితో ఆడాను' అంటూ సెహ్వాగ్ తన రెండు లైన్ల అప్లికేషన్లో పేర్కొన్నాడు.
రెండులైన్ల దరఖాస్తును పంపించిన సెహ్వాగ్
సెహ్వాగ్ పంపిన దరఖాస్తు చూసి విస్తుపోయిన బీసీసీఐ అధికారులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్ను పంపించమంటూ సెహ్వాగ్ని బ్రతిమాలారు. 'సెహ్వాగ్ రెండులైన్ల దరఖాస్తును పంపించాడు. దానికి అనుబంధంగా రెజ్యూమ్ కూడా పంపలేదు. దీంతో దరఖాస్తుతోపాటు రెజ్యూమ్ కూడా పంపాల్సిందిగా మేం అతన్ని అడిగాం. అతను ఈ పదవి కోసం తొలిసారి ఇంటర్వ్యూ హాజరవుతున్నాడు' అని బీసీసీఐకి చెంది ఓ అధికారి తెలిపాడు.
కొత్త కోచ్ రేసులో కుంబ్లేతో కలిపి మొత్తం ఆరుగురు
కొత్త కోచ్ పదవి రేసులో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేతోపాటు సెహ్వాగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్, దేశవాళీ వెటరన్ ఆటగాడు లాల్చంద్ రాజ్పుత్ తదితరులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలో ఉన్నారు.
కోచ్ ఎంపిక బాధ్యత క్రికెట్ సలహా కమిటీదే
కొత్త కోచ్ ఎంపిక బాధ్యతను గంగూలీ, సచిన్, లక్ష్మణ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా సంఘానికి వినోద్రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీ అప్పగించింది. కొత్త కోచ్ కోసం క్రికెట్ సలహా కమిటీ ఇంగ్లాండ్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుత కోచ్ హోదాలో కుంబ్లే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.