బెంగళూరు: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం నాడు భావోద్వేగ ప్రసంగం చేశాడు. విరాట్ కోహ్లీ అండ్ కో వెస్టిండీస్ పర్యటనకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ధోనీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
విండీస్ బయలుదేరే టీమిండియాను ఉద్దేశించి ధోనీ మాట్లాడుతూ... ఈ సుదీర్ఘమైన సీజన్ను ఆటగాళ్లు చక్కగా వినియోగించుకోవాలని, మైదానంలో ఒకరితో ఒకరు సమన్వయంగా ఆడాలని సూచించాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే, విజయం దానంతట అదే వస్తుందని చెప్పాడు.
క్రికెట్ను ఓ వినోద సాధనంగా భావించాలని, ఇంత పెద్ద పర్యటనకు తాను ఆడబోవడం లేదని ఆలోచిస్తేనే బాధ కలుగుతోందన్నాడు. ఇక్కడున్న వాళ్లలో అత్యధికులు ఐదేళ్ల వయసు నుంచి బ్యాటు పట్టుకున్న వాళ్లేనని, గత రెండు మూడేళ్ల వ్యవధిలోనే జట్టులోకి వచ్చారని చెప్పాడు.
సీనియర్లు జట్టుకు దూరమైన తర్వాత, భారత జట్టు తిరిగి టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో సమీప భవిష్యత్తులో ఆడనున్న పదిహేడు మ్యాచులు ఎంతో కీలకమైనవని, ఆటగాళ్లు విజయం సాధించాలన్నాడు. అందరు కలిసి ఉండాలని సూచించాడు.
మీలో కొందరు ఫెయిలైనా, అందరు కలిసి విజయం సాధించాలన్నాడు. మీరంతా కలిసి ఉంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరని చెప్పాడు. క్రికెట్ కంటే జీవితం ముఖ్యమైనదని, అందరం కలిసి ఏళ్ల కొద్ది ఆడాలని, కాబట్టి అందరం కలిసి ఉండాలన్నాడు. ధోనీ భావోద్వేగంతో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.