హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో కూడా ఆసీస్ ఆటగాళ్లు నోరు పారేసుకుంటున్నారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజాను ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ మాటలతో కవ్వించాడు. రవీంద్ర జడేజా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు.
248/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్కు సాహా-జడేజా జోడి చక్కని ఆరంభాన్ని ఇచ్చింది. 102 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 37, సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోరుని సమం చేయాలంటే టీమిండియా 16 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ సమయంలో ఆసీస్ స్పిన్నర్ లియాన్ వేసిన 103వ ఓవర్లో కీపర్ మాథ్యూవేడ్.. జడేజాను కవ్వించాడు. 'ఏమైంది ఎందుకలా ఆడుతున్నావు.. ఇక్కడికెందుకు వస్తున్నావు' అని అన్నాడు.
దీంతో వెంటనే రవీంద్ర జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి 'అతడు (వేడ్) ఆపకపోతే నేను మొదలుపెట్టాల్సి వస్తుంది' అని చెప్పాడు. అయినా సరే జడేజా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కెప్టెన్ స్టీవ్ స్మిత్తో పాటు వికెట్ కీపర్ వేడ్ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో జడేజా 83 బంతులను ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం జడేజా 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అర్ధసెంచరీ అనంతరం జడేజా తనదైన స్టైల్లో బ్యాట్ను కత్తిలా ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సాహాతో కలిసి జడేజా ఏడో వికెట్కు 96 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.