హైదరాబాద్: పాకిస్థాన్తో టీమిండియా క్రికెట్ ఆడనందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెద్ద మొత్తంలో నష్టపోయిందట. పాక్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడనందుకు పీసీబీ ఏకంగా 200 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1340 కోట్లు) కోల్పోవాల్సి వచ్చిందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు.
ఈ విషయాన్ని ఐసీసీ సమావేశాల్లో షహర్యార్ ఖాన్ ప్రస్తావించినట్లు పీసీబీ పేర్కొంది. '2015-23 మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆడతామంటూ చేసుకున్న ఒప్పందాన్ని కూడా బీసీసీఐ గౌరవించట్లేదు. వారి ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని బీసీసీఐకు ముందే చెప్పాం. అదేమీ చేయకుండా ఒప్పందం చేసుకుని.. ఇప్పుడు దాని ప్రకారం నడుచుకోవట్లేదు' అని ఖాన్ అన్నాడు.
గతంలో ఒప్పందం ప్రకారం పాకిస్థాన్లో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో పాక్తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. 2007 తర్వాత పాకిస్థాన్తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు.
అయితే ఆ తర్వాత 2012-13 సీజన్ మధ్యలో పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు వచ్చి కొన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడటం జరిగింది. పీసీబీ తన ఆదాయాన్ని కోల్పోవడంతో బీసీసీఐ విషయాన్ని ఐసీసీ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, చట్టపరంగా వాళ్లతో పోరాడుతాం అని ఖాన్ మీడియాకు వెల్లడించారు.