కింగ్స్టన్: ట్వంటీ 20 ప్రపంచ కప్ ముంగిట వెస్టిండీస్లో మరో సంక్షోభం. జీతాల గొడవ మరోసారి ముందుకు వచ్చింది. గడువు తేదీ అయిన ఆదివారం నాటికి ఆటగాళ్లు కాంట్రాక్ట్లకు ఒప్పుకోకుంటే వారికి జట్టు నుంచి ఉద్వాసన పలుకుతామని విండీస్ బోర్డు హెచ్చరించింది.
పదిహేను మంది సభ్యుల జట్టు కాంట్రాక్టులను తిరస్కరించిన నేపథ్యంలో బోర్డు తీవ్రంగా స్పందించింది. ప్రపంచ కప్లో ఆడేందుకు బోర్డు కట్టుబడి ఉందని, ఇందులో మరో మాటకు తావులేదని, అయితే కాంట్రాక్ట్పై సంతకం చేయకుండా ఏ ఆటగాడు కూడా విండీస్ దాటి వెళ్లలేడని చెప్పింది.
ఈ ఆటగాళ్లు కాంట్రాక్ట్లపై సంతకం చేయొద్దని నిర్ణయించుకుంటే వారి స్థానంలో ఇతర ఆటగాళ్లను ఎంపిక చేయడం తప్ప మాకు మరో మార్గం లేదని బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి మైకెల్ ముర్హెడ్ స్పష్టం చేశాడు.
తమకు ఇవ్వజూపిన మొత్తం సమ్మతం కాదని, కాంట్రాక్టులకు తాము ఒప్పుకోమని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ డారెన్ సామి అంతకుముందు విండీస్ బోర్డుకు లేఖ రాశాడు. తాము వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నామని, కానీ కాంట్రాక్ట్ కింద మాకు ఇస్తామంటున్న మొత్తం ఆమోదయోగ్యం కాదని, తమకిచ్చే మొత్తం దాదాపు 80 శాతం తగ్గించారన్నాడు.