కోల్కతా: ప్రపంచ కప్ ట్వంటీ 20 కప్ గెలిచిన అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ తమ దేశ బోర్డు పైన మండిపడ్డాడు. దానికి బోర్డు కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే తమ కెప్టెన్ సామి చెప్పింది నిజమేనని, విండీస్ ప్లేయర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ మంగళవారం నాడు చెప్పాడు.
ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ప్రపంచ ట్వంటీ 20 ఫైనల్లో ఇంగ్లాండు పైన విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. మ్యాచ్ అనంతరం సామి మాట్లాడుతూ.. తమకు విండీస్ బోర్డు నుంచి ఎలాంటి సహకారం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కంటతడి పెట్టినంత పని చేశాడు.
సామికి ఇప్పటికే మరో ఆటగాడు డ్వేన్ బ్రావో నుంచి మద్దతు లభించింది. తాజాగా క్రిస్ గేల్.. సామి ఆరోపణలు నిజమని చెప్పాడు. తమ మ్యాచ్ ఫీజు ఓ జోక్ అని, అయితే దానిని తాను ఏదైనా చారిటీకి ఇస్తానని క్రిస్ గేల్ చెప్పాడు.
తాను తన కెప్టెన్ సామీ వ్యాఖ్యలతో వంద శాతం ఏకీభవిస్తానని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, ఆయన ప్రసంగం నిజమని, విండీస్ బోర్డు గురించి బాగా చెప్పాడని, మేం పడుతున్న ఇబ్బందులు నిజమని చెప్పాడు. డారెన్ సామీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారని, తాను కాలేదని చెప్పాడు.
అయినప్పటికీ తనను టెస్టులకు, వన్డేలకు తీసుకోలేదని చెప్పాడు. ప్రైజ్ మనీ వచ్చినందుకు తాను దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నానని, ఎందుకంటే తమకు మ్యాచ్ ఫీజు ఓ జోకు అన్నాడు. నా మ్యాచ్ ఫీజును నేను చారిటీకి డొనేడ్ చేస్తున్నానని అతను సామాజిక అనుసంధాన వేదికల్లో పేర్కొన్నాడు. మ్యాచ్ ఫీజు జోకు అని చెప్పడం ద్వారా విండీస్ బోర్డు తమకు మ్యాచ్ ఫీజు ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డాడు.