హైదరాబాద్: ఇటీవలే లండన్ వేదికగా ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్ల్లో తన ప్రదర్శన బాగా లేకపోవడంతో జట్టు నుంచి తప్పించాలని కోచ్ని కోరినట్లు పేసర్ ఝలన్ గోస్వామి వెల్లడించింది. అయితే కోచ్ తుషార్ ఇందుకు ఇష్టపడకపోవడం, కెప్టెన్ మిథాలీ బాగా మద్దతివ్వడంతో తర్వాతి మ్యాచ్ల్లో పుంజుకున్నానని చెప్పింది.
మంగళవారం కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వార్షిక అవార్డుల కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఝలన్ను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి రూ. 10 లక్షల చెక్ను ఆమెకు అందజేసింది.
ఈ సందర్భంగా ఝలన్ గోస్వామి మాట్లాడుతూ 'టోర్నీ ఆరంభంలో నా ప్రదర్శన నిరాశపర్చింది. వెస్టిండీస్తో మ్యాచ్ తర్వాత నా బౌలింగ్ గురించి కోచ్తో చర్చించాను. నేను మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నానని.. తర్వాత మ్యాచ్లో జట్టు నుంచి పక్కకి తప్పించాల్సిందిగా కోరాను. కానీ కోచ్ నా అభ్యర్థనని తిరస్కరించారు' అని పేర్కొంది.
నీవు జట్టులో ఉండాల్సిందే, బౌలింగ్ సారథ్యం వహించాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాడని ఝలన్లన్ పేర్కొంది. కోచ్ వ్యాఖ్యలు తనకు బాగా స్ఫూర్తినిచ్చాయని చెప్పిన ఝలన్... మిథాలీతో కలిసి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశానని వెల్లడించింది. దాని ఫలితం ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ను డకౌట్ రూపంలో కనిపించిందని వెల్లడించింది.
'ఆసీస్పై గెలువడం మాకు చాలా కీలకం. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు వాళ్లది. లానింగ్ అత్యుత్తమ ప్లేయర్. స్కేర్ కట్స్లో కొట్టడంతో ఆమె దిట్ట. నీవు కోరుకున్నట్లు బౌలింగ్ చేయమని మిథాలీ కూడా నాకు మంచి మద్దతిచ్చింది. అంతే సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తూ లానింగ్ను డకౌట్ చేశా. ఆ తర్వాత అన్ని మాకు అనుకూలంగా రావడంతో మ్యాచ్ గెలిచాం' అని జులన్ పేర్కొంది.
తన క్రికెట్ కెరీర్లో క్యాబ్ అన్ని రకాలుగా చాలా సహకారం అందించిందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. ఐసీసీ టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడిన ఝలన్ మొత్తం పది వికెట్లు తీసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిరస్మరణీయమైన 3/23 బౌలింగ్తో ఆకట్టుకుంది.