ముంబై: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా ఉన్న అనిల్ కుంబ్లే ఇటీవలే భారత జట్టు హెడ్ కోచ్గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఎడిన్బర్గ్లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సభ్య సమావేశంలో కుంబ్లే తర్వాత క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో ఎవరిని నియమించాలనే అంశం చర్చకు వచ్చింది.
అయితే ఇప్పటికి ఇప్పుడే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఐసీసీ భావిస్తోంది. అయితే కుంబ్లే స్ధానంలో క్యాబ్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఐసీసీ పెద్దలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ధర్మశాలలో బీసీసీఐ నిర్వహించిన సమావేశంలో హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేని ఎంపిక చేసిన సమయంలో దీనిపై చర్చించినట్లు సమాచారం. ఈ పోస్ట్కు గంగూలీ అయితే న్యాయం చేయగలుగుతాడని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తన మనసులోని మాటలను వెల్లడించినట్టు సమాచారం.
గతంలో ఈ పదవిని తీసుకునేందుకు గంగూలీ కూడా ఆసక్తిని కనబర్చారు. అయితే ఆ తర్వాత బీసీసీఐ క్రికెట్ దిగ్గజాలు గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లను అడ్వైజరీ ప్యానెల్లో నియమించడంతో దాదా వెనక్కి తగ్గారు. ఎందుకంటే సౌరభ్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు కాక ముందు ఆయన్ని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఛైర్మన్గా నియమించింది.
ఈ పోస్ట్ దాదాపు ఐసీసీ క్రికెట్ కమిటీ పదవితో సమానంగా ఉంటుంది. అంతేకాదు ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పోస్ట్ అనేది బీసీసీఐ పరిధిలోనిది కాదు. ఈ పదవిలో ఐసీసీ మాజీ క్రికెటర్ను ఎవరినైనా నియమించొచ్చు. ఈ కారణంగానే దాదా క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవి రేసు నుంచి తప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా ఉన్న కుంబ్లే భారత జట్టు హెడ్ కోచ్గా బీసీసీఐ నియమించడంతో ఈ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కుంబ్లే రాజీనామా చేస్తే ఈ పదవిలో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చలో భాగంగా తాజాగా తెరపైకి సౌరభ్ గంగూలీ పేరు వచ్చింది.
అయితే ఐసీసీ క్రికెట్ కమిటీ పదవిపై సౌరభ్ గంగూలీ గానీ, ప్రస్తుతం ఎడిన్బర్గ్లో ఐసీసీ వార్షిక సమావేశాలకు హాజరనై బీసీసీఐ సెక్రటరీ అజయ్ శ్రింక్ స్పందించలేదు. భారత జట్టు హెడ్ కోచ్గా ఎంపికైన అనిల్ కుంబ్లే...ఐసీసీ క్రికెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడం విశేషం.