హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోని బుధవారం గుడ్ బై చెప్పిన నేపథ్యంలో పలువురు మాజీలు తమ స్పందనను తెలియజేశారు. ధోని తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. ఈ క్రమంలో ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట్లాడారు. ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అభినందించారు.
రాంచీలోని డీఏవీ స్కూల్లో పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పుడు పుట్ బాల్ నుంచి ధోనిని క్రికెట్కు మారమని అడిగిన వ్కక్తి ఈ బెనర్జీయే కావడం విశేషం. రంజీ ట్రోఫీలో భాగంగా తన సొంత జట్టు జార్ఖండ్కు మద్దతు తెలిపేందుకు నాగ్ పూర్కు బయల్దేరే ముందు ధోని తనను స్కూల్లో కలిశాడని చెప్పాడు.
అయితే వన్డే, టీ20ల కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ధోని రాంచీకి వచ్చినప్పుడల్లా స్కూల్కి తప్పకుండా వచ్చేవాడని అన్నాడు. ఈ ఏడాది జూన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ధోని కెప్టెన్గా ఉండాడని తాను భావించానని, అయితే బుధవారం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం ఎంతో ఆశ్చర్యానిగి గురి చేసిందని అన్నాడు.
ఇక ధోని మరో కోచ్ చంచల్ భట్టాచార్య మాట్లాడుతూ ధోనీ సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. అలా చేసి తాను టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొత్త సంవత్సర బహుమతి ఇచ్చాడని అభిప్రాయపడ్డారు. 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన ధోనీ టీమిండియాకు ఎన్నో ఘన విజయాలు అందించాడు.
2007లో ఐసీసీ వరల్డ్ టీ20, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను ధోని నేతృత్వంలో టీమిండియా సాధించింది. అంతేకాదు ధోని హయాంలో 2009లో టెస్టుల్లో టాప్ ర్యాంకును భారత జట్టు కైవసం చేసుకుంది. ధోని నేతృత్వంలో భారత 199 వన్డేలు ఆడి 110 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
72 టీ20ల్లో 41లో విజయం సాధించగా, 28 మ్యాచ్ల్లో ఓడింది. కెప్టెన్గా వన్డేల్లో 54 యావరేజితో 6,633 పరుగులు చేశాడు. టీ20ల్లో ధోని కెప్టెన్గా 122.60 యావరేజితో 1,112 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయాడు.