హైదరాబాద్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు ఫైనల్కు చేరింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
ఓపెనర్గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ (62) అర్ధసెంచరీతో రాణించగా, స్మృతి మందన 21, వేదా కృష్ణమూర్తి 21 పరుగులు సాధించారు. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 69 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టు స్కోరు 16 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన దిలానీ మండోదర (20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరుని అందుకున్నారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్ల ధాటికి నాలుగు పరుగుల వ్యవధిలో లంక తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది.
భారత మహిళల జట్టులో ఏక్తా బిస్త్, ప్రీతి బోస్లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, జులాన్ గోస్వామి, అనుజా పటేల్, పూనమ్ యాదవ్లు తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో అర్ధసెంచరీతో రాణించిన మిథాలీ రాజ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం ఈ టోర్నీలో భారత్కు నాలుగో విజయం కావడం విశేషం.
అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించింది. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు నేపాల్తో తలపడుతుంది.