హైదరాబాద్: టీమిండియాను బెంగుళూరులో ఎదుర్కొవడం కష్టమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఇండియా టుడే టీవికి ఇచ్చిన ఇంటర్యూలో క్లార్క్ మాట్లాడుతూ తొలి టెస్టులో ఆడిన విధంగా బెంగుళూరు టెస్టులో స్టీవ్ స్మిత్ సేన కనబరచకపోతే విజయం సాధించడం చాలా కష్టమని క్లార్క్ అన్నాడు.
పూణె టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలవడం అనుకూలంగా మారిందనీ, కానీ రెండో టెస్టులో కూడా అలాగే జరుగుతుందని ఊహించలేమని అన్నాడు. రెండో టెస్టులో టీమిండియా గనుక టాస్ నెగ్గి, బ్యాటింగ్ ఎంచుకుంటే స్మిత్ సేనకు కష్టాలు తప్పకపోవచ్చని మైకేల్ క్లార్క్ చెప్పాడు.
'ఒకవేళ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టి ఉంటే ఫలితం తారుమారు అయి ఉండేదేమో ఏమో ఏమి జరిగేదో చెప్పలేం' అని క్లార్క్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్కు మైకేల్ క్లార్క్ కామెంటేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
భారత్లో టెస్టులు ఆడేటప్పుడు తొలి ఇన్నింగ్స్ పరుగులు చాలా కీలకమని, తొలి ఇన్నింగ్స్లో 450పైగా పరుగులు చేస్తే టాస్ ఎవరు గెలిచారన్న దాని గురించి పట్టించుకోవల్సిన అవసరంలేదని, విజయం వాళ్లదే అవుతుందని క్లార్క్ చెప్పాడు. ఉపఖండంలోని పిచ్లపై మొదటి మూడు రోజుల్లో ఆట నెమ్మదిగా సాగుతోందని, చివరి రెండు రోజులు పూర్తిగా స్పిన్కు అనుకూలంగా మారిపోతాయన్నాడు.