హైదరాబాద్: ఆతిథ్య జట్టుగా టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం తమకు అతిపెద్ద సవాల్ అని ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరిస్ను ముగించుకుని స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మోర్గాన్ కెప్టెన్సీలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు భారత్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇయాన్ మోర్గాన్ ఆదివారం మీడియాతో మాట్లాడాడు. 'అవును. భారత్తో వన్డే, టీ20 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత్ను భారత్లో ఢీకొనడం ప్రత్యేకమైన అనుభవం' అని అన్నాడు.
'సొంతగడ్డపై భారత్ బలమైన జట్టు. వారిని ఓడించడం చాలా కష్టం. ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చిన్న సిరీసే అయినా మేం నేర్చుకోవడానికి చాలా ఉంది'' అన్నాడు. ఆదివారం ముంబైలో ఇయాన్ మోర్గాన్తో పాటు వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా నెట్ సెషన్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్లు ఆడనున్న భారత్-ఏ జట్టు కూడా ప్రాక్టీసుని మొదలుపెట్టాయి. ఈ ప్రాక్టీస్లో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నయవరాజ్ సింగ్తో పాటు ధావన్ సహా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
ఇదిలా ఉంటే ధోని నేతృత్వంలోని భారత్-ఏ జట్టు మంగళవారం ఇంగ్లాండ్తో ప్రాక్టీస్ వన్డే ఆడనుంది. గురువారం అజ్యింకే రహానె నాయకత్వంలోని మరో జట్టు ఇంగ్లాండ్తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా 15న పుణెలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.