హైదరాబాద్: టీమిండియాకు వరల్డ్ టీ20 సాధించడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రి ఓం ప్రకాశ్శర్మపై రోహ్తక్లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు జోగిందర్ శర్మ తండ్రిని కత్తితో పొడిచి దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 68 ఏళ్ల ఓం ప్రకాశ్ రోహతక్ కాథ్మండి సమీపంలో తన కిరాణ దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్డ్రింక్స్, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి వచ్చి ఓంప్రకాశ్పై దాడి చేశారు.
'వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో నా కడుపులో పొడిచారు. వారు నా దుకాణంలోని డబ్బు అంతా తీసుకొని వెళ్లారు. రూ. 7వేల వరకు నగదు పోయింది' అని ఓంప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
అంతేకాదు గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి బయట నుంచి0 మూసేసి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ వేసిన శర్మ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.