కోల్కత్తా: పాకిస్థాన్తో శనివారం కోల్కత్తాలో జరగనున్న మ్యాచ్కు సిద్ధంగా ఉన్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. శుక్రవారం అశ్విన్ విలేకరులతో మాట్లాడుతూ పాక్తో ఆడే మ్యాచ్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో తమకు తెలుసునని చెప్పుకొచ్చాడు.
వరల్డ్ టీ20 ఫెవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా... నాగ్పూర్లో ఈనెల 15న న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై అశ్విన్ ప్రతి మ్యాచ్లోనూ గెలవాలనే ఆడతామని చెప్పాడు. టీ20 క్రికెట్లో ఏజట్టు ఫేవరేట్ కాదన్నాడు.
మైదానంలో ఆడే ఇరు జట్లకు సమాన అవకాశాలుంటాయని పేర్కొన్నాడు. పాకిస్థాన్తో ఆడే మ్యాచ్లో తాము ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వబోమని చెప్పాడు. భారత్-పాక్ల మధ్య చాలా మ్యాచ్లు ఆడామని గుర్తు చేశాడు. భారత్ ఆడే ప్రతి మ్యాచ్లో కూడా ఒత్తిడితోనే కూడుకుని ఉంటుందని అన్నాడు.
ఆస్టేలియా- ఇంగ్లాండ్ల మధ్య జరిగే యాషెస్ సిరిస్ కంటే కూడా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్లో భావోద్వేగాలు అధికంగా ఉంటాయని చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ను అభిమానులు ఆటలా కాకుండా, సరిహద్దు వివాదంలా చూస్తారని పేర్కొన్నాడు.
ఇక ప్రజల విషయానికి వస్తే తమపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారని చెప్పాడు. మైదానంలో భావోద్వేగాలు పక్కన పెట్టి మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని అశ్విన్ చెప్పాడు. కాగా, కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్డేడియంలో శనివారం భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
గతంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో పాకిస్థాన్తో భారత్ తలపడిన 4 సార్లు టీమిండియానే విజయం సాధించింది. అయితే ప్రస్తుతం టోర్నీలో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ విజయం సాధించి మంచి ఉత్సాహాంతో ఉంది. సెమీస్కు చేరుకోవాలంటే సూపర్ 10లో భాగంగా పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.