నాగపూర్: ప్రపంచ టీ20 టోర్నీలో ఎంతో ఆత్మ విశ్వాసంతో టీమిండియా పాల్గొంటోందని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే, ఇటీవల జరిగిన ద్వైపాక్షిఖ సిరీస్లు, ఆసియా కప్ల కన్నా ఈ టోర్నీ పెద్ధ సవాలేనని చెప్పాడు.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్(విసిఏ) స్టేడియంలో మంగళవారం(మార్చి15న) న్యూజిలాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. 2 ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా కప్ టీ20 గెలిచిన కారణంగా భారత్పై అంచనాలు భారీగానే ఉంటాయని చెప్పాడు.
'ఇటీవలి విజయాలతో ఆత్మ విశ్వాసంతోనే టోర్నీలో పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు మేము ఆడిన 11 మ్యాచుల్లో 10 గెలిచాం. మంచి అంచనాలతోనే టీ20 మెగా టోర్నీలో ప్రవేశిస్తున్నాం. ' అని కోహ్లీ తెలిపాడు.
'ఈ మెగా టోర్నీలో పాల్గొనేముందు ఆసియా కప్ మంచి సన్నాహకంలా పని చేసింది. పెద్ద జట్లతో తలపడేందుకు అన్ని రకాల సన్నద్ధమయ్యాం. అయినా, మా ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి' అని తెలిపాడు.
'ప్రత్యర్థి జట్ల బలాలు, బలహీనతలు తమకు తెలుసునని చెప్పాడు. ప్రతీ మ్యాచులో గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని కోహ్లీ చెప్పాడు. ఫీల్డ్లో ఎలా ఉన్నా.. ఆఫ్ ఫీల్డ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు.
కాగా, గ్రూట్-2లో ఇండియాతోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇందులో 2 జట్లు మాత్రమే సెమీ ఫైనల్స్కు చేరుకుంటాయి. 2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్థాన్ పై గెలిచిన ధోనీ నాయకత్వంలోని టీమిండియా టోర్నీ అందుకుంది. ఈ సారి కూడా ఈ రెండు జట్లు ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. ఏప్రిల్ 3న కోల్ కతాలో జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగుస్తుంది.