కోల్కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మార్చి 19న జరగనున్న మ్యాచ్ను కోల్కత్తాకు మార్చారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది.
నిజానికి టోర్నీ షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ని హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియాన్ని ఐసీసీ ఖరారు చేసింది. అయితే ధర్మశాల వేదిక నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని పీసీబీ పంపించిన ఇద్దరు సభ్యుల బృందం సిఫారసు చేయడంతో ధర్మశాల నుంచి వేరే వేదికకు మ్యాచ్ని మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరింది.
అయితే తొలుత వేదికను మార్చే సమస్యే లేదని తేల్చిచెప్పిన ఐసీసీ, ఆ తర్వాత పాకిస్థాన్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి వేరే వేదికకు మార్చే విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐసీసీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించింది.
భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వేదిక మార్పే గనుక జరిగితే కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం మొహాలీ, బెంగుళూరు వేదికలను కూడా బీసీసీఐ పరిశీలించింది.
అయితే చివరకు కోల్కత్తా వేదికనే ఖరారు చేసింది. వేదిక మార్పుపై ఐసీసీ పరిశీలన ఉన్న నేపథ్యంలోనే మంగళవారం రాత్రి పాకిస్థాన్ నుంచి బయల్దేరాల్సిన ఆ దేశ జట్టు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు పీసీబీ పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్, పాకిస్థాన్తో మ్యాచ్కు ఆతిథ్యమిచ్చే విషయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది.