మొహాలీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు కోహ్లీ వీర విహారం చేశాడు. 51 బంతుల్లో అతను 82 పరుగులు చేశాడు. కోహ్లీ రెచ్చిపోవడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఆసిస్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది.
విరాట్ కోహ్లీ వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ రికార్డులు బద్దలు చేశాడు. గతంలో, ట్వంటీ 20ల్లో ఫాస్టెస్ట్ 1,500 పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. దానిని కోహ్లీ తుడిచి వేశాడు.
విరాట్ కోహ్లీ 39 ఇన్నింగ్స్ ఆడి పదిహేను వందల పరుగులు పూర్తి చేశాడు. క్రిస్ గేల్ పదిహేను వందల పరుగులు పూర్తి చేసేందుకు 45 ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు చేశాడు. అంతేకాదు, భారత్ తరఫున ట్వంటీ 20ల్లో 1500 పరుగులు చేసిన తొలి ఆటగాడు విరాట్ కోహ్లీయే.
1,500 పరుగులు పూర్తి చేసిన వారిలో యావరేజ్ పరంగా చూసినా కోహ్లీయే టాప్లో ఉన్నాడు. కోహ్లీ యావరేట్ 42 మ్యాచులకు 55.42గా ఉంది.
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విషయ తెలిసిందే. ఇప్పుడు ట్వంటీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో కోహ్లీ (భారత్), క్రిస్ గేల్ (వెస్టిండీస్)లు ఈ నెల 31వ తేదీన తలపడనున్నారు.