న్యూఢిల్లీ: భారత్లో వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్లో పాకిస్థాన్ పాల్గొనేందు ఆ దేశ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోర్నీలో పాల్గొనే అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) గత వారంలో తెలిపిన సంగతి తెలిసిందే.
భారత్లో పాకిస్థాన్ జట్టుకు రక్షణపై గత కొంతకాలంగా పీసీబీ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో టోర్నీలో ఆడే నిర్ణయంపై వాయిదా వేసిన అక్కడి ప్రభుత్వం తాజాగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ 'అత్యున్నత భద్రత కల్పిస్తామని' హామీ ఇవ్వడంతో జట్టును భారత్కు పంపేందుకు అంగీకరించింది.
పాక్ ప్రభుత్వ నిర్ణయంపై పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ భారత్ ప్రభుత్వం పాక్ క్రికెట్ జట్టు పర్యటన, వసతులు విషయంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే అభిమానులకు వీసా సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.
భారత్లో తొలిసారిగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మార్చి 8న ఆరంభమై, ఏప్రిల్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఇదిలా ఉంటే భారత్, పాకిస్థాన్ మధ్య మార్చి 19న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుంది. అంతక ముందు భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ పాల్గొనడానికి సంశయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
భారత్పై ఇటీవల జరిగిన పఠాన్ కోట్ దాడులే ఇందుకు కారణమంటున్నారు. ఇందులో భాగంగానే తమ జట్టు భారత్లో పర్యటిస్తే దాడులకు గురయ్యే అవకాశం ఉందని పీసీబీ భావిస్తోంది. అదే విషయాన్ని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లింది
దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ భారత్లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏ దేశమైనా భారత్లో ఆడటం ఇష్టం లేకపోతే ఐసీసీకి తమ నిర్ణయం తెలపొచ్చని, తాము మాత్రం టీ20లో పాల్గొనే అన్ని జట్లకు పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు.