బెంగళూరు: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచు చివరి బంతి వరకు ఉత్కంఠను రేపింది. రోమాంచితమైన ఈ మ్యాచులో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవరులో 11 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 9 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవరు తొలి బంతికి బంగ్లాదేశ్ 1 పరుగు రాబట్టింది. తర్వాతి రెండు బంతులకు నాలుగేసి పరుగులు చేసింది. ఆ తర్వాత వరుసగా ముగ్గురు బ్యాట్స్మెన్ మూడు బంతులకు అవుటయ్యారు. చివరి బంతికి పరుగు తీయబోయి బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ హోమ్ రన్నవుట్ అయ్యాడు.
భారత్ తమ ముందుంచిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ దూకుడుగా ఆడుతూ విజయానికి చేరువగా వచ్చింది. అయితే, చివరలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో అశ్విన్, పాండ్యా, జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. నెహ్రా, సురేష్ రైనాలకు చెరో వికెట్ పడింది. ఈ విజయంతో భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ట్వంటీ20 మ్యాచ్ చివరి ఓవరులో ఉత్కంఠగా మారింది. చివరి ఆరు బంతుల్లో బంగ్లాదేశ్ 11 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పడింది. చివరి ఓవరును ధోనీ హార్దిక్ పాండ్యాకు ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగులో రెండు ఫోర్లతో బంగ్లాదేశ్ విజయానికి చేరువైన సమయంలో వికెట్ పడింది. రహీం 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
భారత్ తన ముందుంచిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 11 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 87 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ను జారవిడుచుకుంది. మొర్తాజా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొహమ్మద్ మిథున్ అశ్విన్ బౌలింగులో 1 పరుగు చేసి అవుటయ్యాడు.
బంగ్లాదేశ్ 17.5 ఓవర్ల 126 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. సౌమ్య సర్కార్ 21 పరుగులు చేసి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.
బంగ్లాదేశ్ 95 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో షకీబ్ ఆల్ హసన్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
సురేష్ రైనాకు వికెట్ లభించింది. బంగ్లాదేశ్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షబ్బీర్ రహ్మాన్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సురేష్ రైనా బౌలింగులో స్టంపవుట్ అయ్యాడు.
అశ్విన్ బౌలింగులో బుమ్రా ఓ క్యాచ్ వదిలేశాడు. మ్యాచ్ ఆరంభంలో మిస్ ఫీల్డ్ చేసి ఫోర్ ఇచ్చాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతున్న క్రమంలో బంగ్లాదేశ్ 55 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 7.4 ఓవర్ల వద్ద రవీంద్ర జడేజా బౌలింగులో స్టంపవుట్ అయ్యాడు.
ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బంగ్లాదేశ్పై మ్యాచులో బుధవారం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి146 పరుగులు చేసింది. దూకుడుగా ఆడే క్రమంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అశ్విన్ ఐదు పరుగులతో కెప్టెన్ ధోనీ 13 పరుగులతో నాటౌట్గా మిగిలారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో ఆల్ అమీన్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హోమ్, షకీబ్ అల్ హసన్, మహ్ముదుల్లా తలో వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో బంగ్లాదేశ్పై భారత బ్యాటింగ్ స్లోగా ప్రారంభమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మందకొడిగా బ్యాటింగ్ ప్రారంభించారు.
భారత్ 19.1 ఓవర్ల వద్ద 137 పరుగులు చేసి ఏడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహ్మాన్ బౌలింగులో అవుటయ్యాడు.
యువరాజ్ సింగ్ నిరాశపరిచాడు. కేవలం మూడు పరుగులు చేసి మహ్మదుల్లా బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 117 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.
భారత్ 112 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్గా హొస్సేన్ బౌలింగులో అవుటయ్యాడు. అదే బౌలర్ చేతిలో సురేష్ రైనా అంతకు ముందు 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్గా పెవిలియన్ చేరుకున్నాడు.
దూకుడుగా ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ వికెట్ జారవిడుచుకున్నాడు. దీంతో భారత్ 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. శువగత హోమ్ బౌలింగులో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందు బంతికి అతను సిక్స్ బాదాడు.
భారత్ బంగ్లాదేశ్ బౌలింగును ఎదుర్కోవడంలో తడబడుతోంది. 45 పరుగులకే భారత్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. శిఖర్ ధావన్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ ఆల్ హసన్ బౌలింగులో రెండో వికెట్గా పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందు రోహిత్ శర్మ 18 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగులో అవుటయ్యాడు.
ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ కెప్టెన్ భారత్పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్కు దిగింది. భారత్ తుది జట్టులో ఏ విధమైన మార్పులు కూడా చేయలేదు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచులో ఓడిపోయిన భారత్ ఆ తర్వాత పాకిస్తాన్పై జరిగిన మ్యాచులో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తాను ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దాంతో దాదాపుగా సెమి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.
జట్లు
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆశిష్ నెహ్రూ, బుమ్రా
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, మొహమ్మద్ మిథున్, షబ్బీర్ రహ్మాన్, షకీబ్ ఆల్ హసన్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా, ముషాఫికర్ రహీం, శువగత హోం, ముష్రాఫే మొర్తాజా, ఆల్ అమీమ్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్