ఆసీస్పై 36 పరుగుల తేడాతో విజయం
గురువారం డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించి 2005 తర్వాత ఉమెన్ వరల్డ్ ఫైనల్కు చేరుకుంది. దీంతో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుతో మిథాలీ సేన తలపడనుంది. మహిళల క్రికెట్లో ఇండియా ఇంత వరకు వరల్డ్ కప్ను నెగ్గలేదు. 2005లో మొట్టమొదటిసారి ఫైనల్కు చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
మిథాలీ సేనకు ఓ అద్భుతమైన అవకాశం
ఇప్పుడు మిథాలీ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టుకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. 1983లో ఇదే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఇదిలా ఉంటే గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో మాచ్ స్వరూపాన్నే మార్చడమే కాదు కంగారులకు దిమ్మతిరిగేలా తన బ్యాట్తో సమాధానం చెప్పింది.
115 బంతుల్లో 171 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్
115 బంతుల్లో 20 పోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. టీమిండియా పైనల్లోకి దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ను క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఇన్నింగ్స్తో పోల్చుతున్నారు. అంతేకాదు ఆదివారం లార్డ్స్లో 'కపిల్ డెవిల్స్' పునరావృతం అవుతుందని కూడా భావిస్తున్నారు.
1983 వరల్డ్ కప్లో ఏం జరిగింది?
1983 వరల్డ్ కప్... సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఇక భారత్ ఇంటికే అనుకున్న సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో నాటౌట్తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కట్ చేస్తే జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్ విజేతగా కూడా నిలిచిన సంగతి తెలిసిందే.